వైదికోపాసన:
ఇది నాలుగు విధములుగ వున్నది. 1. సత్యవతి 2. అంగవతి 3. అన్యవతి 4. నిదానవతి అని. "సర్వవ్యాప్తిన మాత్మానం క్షీరేసర్పిరివార్పితమ్" పాలలో నెయ్యి కలిసివున్నట్లే ఆత్మ సర్వవ్యాప్తమై ఉన్నదనే భావముతో చేసే సాధనే సత్యవతీ ఉపాసన అంటారు. "మాయాతీతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా" నేని సమస్థంలో అవ్యక్తంగా వ్యాపించివున్నాను. నన్ను అంతటా నాలో అంతటిని చూస్తూ ఉండే సత్యవతి ఉపాసనకు నేను కనిపించకుండా ఉండను. నాకు ఆ ఉపాసకుడు కనుపించకుండా ఉండడు అంటూ ఉన్నాడు మాధవుడు. ఆ సర్వాత్మనే నిప్పు, గాలి, సూర్యుడు, చంద్రుడు (మొదలైన వన్నీ) అనే భావములో చేయబడేదే అంగవతీ ఉపాసన,ప్రాణరూపమై అందరికీ ఆత్మీయమైన ఆగాలి అన్నింటిని వెలిగించు అగ్ని ప్రాణములకు వివిధ జీవనాధారములైన అన్నము ఉత్పాదన చేయటానికి కావలసినవరుణ (వర్షము) అని పరమాత్మను పొగడుట అంగవతీ ఉపాసన.
“శంఖచక్రగదాపాణి" అని విష్ణువును, ఏకదంతగజాననా" అని విఘ్నేశ్వరుని, "శూలపాణి" అని ఈశ్వరుని, "కోదండపాణి" అనిరాముణ్ణి, శిఖిపించమౌళి మురళీధర" అని కృష్ణుని. "వీణావాణి" అని సరస్వతిని ఇలా ఆయా దేవతల చిహ్నములను ధ్యానపూర్వకంగా మనస్సును తన్మయము చేసుకొని హృదయంలో ఆరాధిస్తూ ఉండటం అన్యవతి ఉపాసన అని అందురు.
"శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం తన్మయాసక్తి, పరమ విరహాసక్తి" అని పదకొండు భక్తిపాధనలు కూడా నిదానవతీ ఉపాసనలో చేరును.
సత్యవతి, అంగవతి. అన్యవతి, నిదానవతీ ఉపాసనలు అనుక్రమేణా ఒకదానికంటే ఒకటి అత్యుత్తమ స్థితికి కారణాలై విశ్వనియంతతో తాదాత్మ్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రతీకోపాసన అని మరొకటి ఉన్నది. అది అంగవతి ఉపాసన లాగానే, ప్రతిరూపోపాసన: - "సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖమ్" సర్వాత్మయైన మాధవునికి ఆంతటా చేతులూ, కళ్ళూ: చూస్తాడు. ఆలోచిస్తాడు, తింటాడు, వింటాడు. సర్వోన్నత ఆదర్శభావములో ప్రతిరూపోపాసన జరుగుతూ వుంటుంది.
భావోపాసన: -
మంచి గుణములన్నింటినీ మాధవునిలో ఆమితంగా వుండినట్లు చూడటమే.
గీతోపాసన:
భారతం పంచమ వేదం. అది ఐహిక ఆముష్మిక ధర్మాలనిధి. మాధవుడు భారతదేశ ధర్మక్షేత్రరంగస్థలంలో తన నాటక సామాగ్రిని దింపుకొని ఆడిన అద్భుతమైన ఆట. మహాభారతము. భారత నాటకానికి పాత్రధారులును, మాటలను, పాటలను సమకూర్చిన రచయిత, నటకుడు, దర్శకుడు, నిర్మాత అంతా ఒక్క మాధవుడే. ఒక వైపున అధర్మవృద్ధమైన అపారభౌతిక బలం, మరొకవైపున ధర్మవృద్ధమైన పరిమిత ఆత్మబలం. ఈ రెంటి ఘర్షణలో పర్యవసాన రూపమైన ధార్మిక విజయజ్యోతిగా తనను నిర్దేశించుట. ఇదే భారతామృత సర్వస్వం, అదే భగవద్గీత మహాభారత సారాంశమంతయూ భగవద్గీతలో ఉన్నది. "కరిష్యే వచనం తవ” నీవు చెప్పినట్లే చేస్తాను. “స్వధర్మే నిధనం శ్రేయః " ఇదే ఐహిక తత్వానికి గీటురాయి. సర్వశ్రేయస్సులను ప్రవహించే భక్తిని నిర్లక్ష్యము చేసి కళ్ళు మూసుకొని "అహం బ్రహ్మస్మి" అనే అహంకారముతో బాధపడే నకిలీ బ్రహ్మలకు క్లేశమే ఫలితము. పొట్టుదంచితే బియ్యము రాదుకదా!; అసలు బ్రహ్మమే కృష్ణుడు.
అద్వైతోపాసన ఆదిశంకరులు –
ఆవు శరీరములో పాలు ఉన్నాయి. ఆపాలలో నెయ్యి ఉన్నది. అయినా ఆ నెయ్యితో ఆవుకు బలము రాదు. ఆపాలను పితికి, కాచి, తోడు పెట్టి, చిలికి, వెన్నతీసి, కాచి, ఆ నెయ్యిని మళ్ళీ ఆవుకుత్రాపించిన బలము కలుగుతుంది. అలాగే సర్వేశ్వరుడు సర్వాంతర్యామి అయినా, సాధనోపచారములు లేకుండా, మానవులలో హితం చేయజాలడు. నువ్వులలో నూనె, పెరుగులో వెన్న, భూమిలో నీరు. కట్టెలో నిప్పుకలిసి వుండునటుల సర్వాంతర్యామి మానవుల శరీరములోను, మనసులలోను కలిసివున్నాడు. వాటిని వేరు చేయాలంటే ప్రయత్నం, సాధన చేయాలి.అపుడు ఆ రెంటి అభేదత్వం అద్వైత్వం తెలుస్తుంది. అదే మోక్షం.
విశిష్టాద్వైతం : రామానుజుడు :
ఉపాసించదగిన పరమాత్మను తనకు వేరుగా వున్నట్లు భావించాలా? లేక తనలో కలిసివుండినట్లు భావించాలా? సాధకునిది ప్రశ్న. ఇక జవాబు: జీవుడు శరీరానికి ఆత్మ. అలాగే దేవుడు జీవునకు ఆత్మ,అలా భావించి ఉపాసించుటే రామానుజా చార్యుల విశిష్టాద్వైతోపాసన. ఈ సమస్తభూతజాలము ఎవనిలో ఉన్నాయో యెవరు ఈ సమస్తానికి అంతర్యామిగా వ్యాపించి యున్నారో ఆ పరమపురుష పరమాత్మ అనన్య భక్తి (ప్రపత్తి)తోనే లభ్యమవుతారు అని పరిజ్ఞాన ప్రపత్తి పూర్వకంగా పరమ పురుషోపాసన చేయటమే విశిష్టాద్వైతం.“త్వమేవ సర్వం మమ దేవ దేవ" నీవే నాగతి. పతి అనే అనన్యభావంతో ఉపాసించుటే.
ద్వైతోపాసన: - మధ్వాచార్యులు –
పతిపత్ని సంబంధమే జీవాత్మ పరమాత్మ సంబంధం కూడా. అవ్యయుడైన విష్ణుభగవానుని భర్తగా ద్వైత భావములో ఉపాసించుట.
చైతవ్యోపాసన: శ్రీకృష్ణ చరణాసక్తి, భక్తిలేనిదే జీవన్ముక్తి మాట అటుంచి కనీసం బుద్ధి శుద్ధంకావటం కూడా అసంభవము అని అంటాడు చైతన్యుడు. మునులూ ఆత్మారాములు అయిన వారికి లౌకిక గ్రంథాలు లేక పోయినా సూదంటురాయిలాంటి శ్రీహరి కల్యాణ గుణగణ విశేషంవల్ల నిష్కారణంవల్లా భక్తిపారవశ్యం వారికి కలుగుతూ వుంటుందట. ఆ పారవశ్యముతో సిగ్గు, బిడియాలు వదలి బిగ్గరగా శ్రీహరి నామసంకీర్తనం, చేస్తూ గగుర్పాటుతో, కంటిధారలతో నృత్యం చేస్తూ అసలైన ఆనందాన్ని అనుభవిస్తూ వుంటారు. శ్రీచరణులు ఈవిశ్వాన్ని పావనం చేస్తూవుంటారు. ఈ విధంగా పరామరక్తిలో నామసంకీర్తన ప్రధానంగా కలిగింది. చైతన్యులఉపాసన,నామసంకీర్తనలలో, తన్మయత్వంలో నృత్యంచేస్తూ తదాత్మ్యభావములో నిలిచి వుండుట ప్రధాన లక్ష్యము.
గౌడియోపాసన:
అవ్యక్త పురుషోత్తమ రూపములో కృష్ణ పరమాత్మను, వ్యక్త పరాశక్తి ప్రకృతిరూపములో రాధను అనుదర్శనము చేస్తూ ఈ కలిలో రాధామాధవ నామసంకీర్తన చేస్తూవుంటే పొందే ఆనందమే కేవలముమోక్షము అంటారు గౌడపాదాచార్యులు. ఆయన సనాతన గోస్వామి. ఆ పరమాత్మ ఆనందరస స్వరూపుడు. ఆ రసాన్ని పొందితేనే ప్రాణికి నిజమైన ఆనందం కలుగుతుంది. అనే శ్రుతి వచనానుసారం-ఆరసోనందనిధిని అనుభవించాలంటే శ్రీరాధామాధవ నామమే శరణ్యం అంటారు.
నింభార్కాచార్యులు –
ద్వైతోపాసనలో పురుష ప్రకృతి సంబంధం వలెనే, జీవాత్మ పరమాత్మ సంబంధంగా భావించి ఉపాసించాలంటారు. వల్లభాచార్యులు. శుద్ధాద్వైతోపాసనలో "కృష్ణస్తు భగవాన్ స్వయం" కృష్ణ భగవానుడు స్వయంగా పరమాత్మ. ఆ పరమాత్మను పొందుటమే శుద్ధాద్వైతమోక్షము.
శైవోపాసన –
"అంగం సర్వకాలం" పృధివ్యాధి తత్త్వాల స్థితి గతులకు మూలకారణమైన లింగము. అదే పరమశివరూపం. ఆ యిష్టలింగ ప్రాప్తినే మోక్షము అని అంటారు.
శివాద్వైతోపాసన –
జీవాత్మ తనను కర్తగాను, భోక్తగాను భావించుకొని ప్రకృతి బద్ధుడు అవుతున్నాడు. శివ ప్రాప్తి కలిగితేనే జీవునకు మోక్షము కలుగుతుంది. అంటే, శివైక్యత కలుగుతుంది అంటారు.
వీరశైవోపాసన - (జంగములు) ఒక ఈశ్వరుడు తప్ప వేరు యేమీ లేదంటారు. ఈశ్వర విభూతిని(శక్తి) పొందటమే ముక్తి అంటారు.
పాశుపతోపాసన –
జీవుడు ప్రకృతి గుణాలనే పాశాలలో కట్టివేయ బడిన పశువు. ఆ పశువుకూ, ఆ పాశాలకూ, ఆప్రకృతికీ నియంత పరమేశ్వరుడు. అందుకే పశుపతిని పొందటమే ముక్తి అంటారు.
శాక్తోపాసన –
"సర్వదేవమయీదేవీ" ఆదిపరాశక్తి సర్వదేవమయి. ఈ వివిధ విచిత్ర రూపములకు నామములకు కారణమైన ప్రకృతియే మాయాశక్తి. ఈ శక్తి కలిగినవాడే మహేశ్వరుడు. ఈ జంట అవయవాలతో ఈ నింగి, నేల నిండి ఉన్నై. అవ్యక్తంగా పురుషరూపంలో వున్న పరమేశ్వరతత్వమే వ్యక్తంగా స్త్రీ రూపములో మాయగావున్న పరాశక్తి. ఆమే జగన్మాత. అమ్మలగన్న యమ్మ. ఆ పరాశక్తి మనలో స్వభావికమై తెలిసినా బలముగా, క్రియగా అనుభవమౌతుంది.
జై నోపాసవ:-
జైనులు (మార్వాడీలు) వైష్ణవ ప్రాధాన్యంగా వుంటుంది. శంఖచక్రధారుడైన విష్ణుభగవానుని ప్రతిమలు దేవాలయములలో పూజిస్తారు.
ణమో అరి హరితాణమ్ ణమోసిద్ధాణమ్:
ణమో అయిరియాణమ్ ణమో ఉవఝ్ఘాయాణమ్
ణమో లోప సబ్యసాహూణమ్ |
ఇవే జైనుల మంత్రాలు.
కామాది వైరులను జయించే మహావీరులకు, సిద్ధులకు, ఆచార్యులకు, ఉపాధ్యాయులకు లోకములో వున్న సర్వసాధువులకు నమస్కారములు. ఈ పంచ నమస్కారములు పాపపరిహారం చేస్తాయి. ఈ మంత్రధారణీ సర్వశుభం. ఈ మంత్ర భావంలోనే ముక్తి పొందాలంటారు జైనులు.
సిక్కులు –
సాంప్రదాయోపాసన ఆత్మతత్త్వోపదేశాన్ని చేసే గురువునూ, ఆయన ఉపదేశాల సమ్మేళనమయిన "గ్రంథసాహెబు"నూ పూజిస్తూ, కీర్తిస్తూ ఉండటమే పరమధర్మం. భారతీయ సంప్రదాయంలో సిక్కు సంప్రదాయము అంతర్భావం.
క్రైస్తవోపాసన-
ఏసుప్రభువువే రక్షకుడు. తెలిసియో, తెలియకనో పాపాలు చేయటం మనిషికి పరిపాటి. మానవుల పాపాలను తొలగించి పరిశుద్ధులను చేయడానికే ఏసుప్రభువు శిలువపై రక్తాన్ని చిందించాడు. ఆప్రభువునూ, ఆయన ఉపదేశాలనూ. "బైబులు" అనే మతగ్రంథములోని సూత్రాలను ఆచరిస్తూ, ఉపాసిస్తూ ఉండటమే మనిషికి మంచి దారి. క్రైస్తవోపాసనలో స్తోత్రము చేయటమే ముఖ్యంగా ఉపాసనా నియమం.
మహమ్మదీయోపాసనా – ఈమాన్దారీ ఖైదామే తో-పైగంబర్ మే భరోసా. ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం దైవము పై సర్వభారము పెట్టి యుండటం, దైవశక్తి అడుగడుగునా గుర్తించుచూ ఉండటం - ఇవి లోకములో ప్రధాన నియమాలు. దేహత్యాగం చేసిన తరువాత పరలోకంలో దేవుని దర్బారులో తన వాస్తవికతను నిరూపించుకొనటం అంటే- అందుకు తగిన రుజువర్తన జీవితాంతం వరకూ కలిగియుండటం. దైవవాణియైన ఖురాను గ్రంథబోధనలను అక్షరాలా ఆచరించటం. ఇవి మహమ్మదీయోపాపనలో పారలౌకికి నియమావళి.
"అల్లా హా అక్బర్" "లా యిలాహ్" "ఇల్లల్లాహ్" - ఇవి మహమ్మదీయుల ప్రధాన మంత్రాలు. (భగవంతుడు సర్వోత్తముడు. అంతకంటే మించిన విశ్వనియంత లేడు. అతడే ఆరాధించ తగినవాడు అని ఈ మంత్రము యొక్క అర్థము). నాకంటే మించినది లేదు. "నా పరమస్తి కంచిత్ " అనే భగవద్గీతార్థము. మహమ్మదీయ మంత్రార్థానికి సామ్యాలే. అందువలన మహమ్మదీయ సాంప్రదాయము కూడా భారతీయ హైందవ సాంప్రదాయములో అవాంతర భాగమే.
ఈ విధంగా మానవుడు ఆత్మపరిశోధనకు ప్రారంభించి నప్పటి నుండి తరతరాల నరజాతికి తారకమైన అనంత విజ్ఞాననిధిగా ఎరంగిన భారతీయుల సంస్కృతి అనంత గంభీరం కావటం వల్ల, భిన్నభిన్న సాంప్రదాయాల రూపాలలో నదులెన్ని వచ్చిననూ, చేరిననూ పొంగక, కృంగక ధర్మసీమలో నిలచియున్నది.
అంతేకాక విశ్వాత్మకమై సార్వభౌతికమై సర్వకారుకమై, పెంజీ కటికవ్వల నే కాకృతియై వెలిగే విజ్ఞాన విజయ జ్యోతియై వెలుగుచున్నది. ఇట్టి పవిత్రమహా సంస్కృతిక క్షేత్రమైన భారత ధాత్రిమీద మనిషిగా పుట్టుటకంటేసుకృతములేదని తెలిసుకోగలిగిన, మనిషికి కలిగే ఆనందం అపారం.
(స.. సా.వా.పు. 171/179)