ఆత్మవిచారమునకు ఆశ్రమధర్మము లెంతయో అవశ్యము. ఆశ్రమ ధర్మజ్ఞానము స్వార్జితము. బాల్యావస్థ అనంతరము వరకూ మనుడు ఆశ్రమవాసి కానేరడు. అంతవరకూ వానికి ప్రాప్తించు జ్ఞానవిశేషము లేనియూ లేవు.
జీవశరీరమునకు బాల్య, కౌమార, యౌవన వార్ధక్యావస్థలున్నటుల జ్ఞానమునకు కూడను నాలుగు అవస్థలు కలవు. అందు మొదటిదగు బాల్యావస్థయందు జీవితము అజ్ఞానదశయందుండి శిష్యత్వమునంగీకరించి, దాశ్యమునకు, శిక్షణకునులోనై యెట్టి బాధ్యతలును లేక జ్ఞానార్జన జేయుచుండవలెను. రెండవదశయగు యౌవనమున సంఘనిర్వహణా బాధ్యతను వహించి ధనార్జనమందును దాని వినియోగమునందును జాగరూకత కలిగి, తనకంటే పిన్నలకు తగిన శిక్షణనొసంగు ఆదర్శములను అందించుచు, పెద్దలను అనుసరించుచూ, జ్ఞానాభివృద్దిని గడించుచుండవలెను. మూడవదశయగు కౌమారమునందు కేవలము స్వీయ సంఘ కుటుంబమే కాక ప్రజాసౌఖ్య నిర్వహణాభారము సైతము వహించి లోక శ్రేయమునకు తన సౌఖ్యమునైనా లక్ష్యపెట్టక, పాటుపడుచూ అంతర్ జ్ఞానమును సంపాదించు చుండవలెను. నాల్గవదియగు వార్ధక్యమునందు తనకు పూర్వము కలిగిన అనుభవమూలమున ఇహలోక సుఖాదులు నిస్సారములనియు, అనిత్యములనియు గ్రహించి విజ్ఞానవంతుడై, దయాపరుడై, సర్వభూతహితుడై తనయనుభవజ్ఞానమును ఇట్లు లోకమునకు చాటవలెను. జీవుల గుణములను, వృత్తులను నాలుగు తరగతులుగా గనుపించుచున్నవి.
తెలివిని పెంచుటకు చదువువలే జ్ఞానమును పెంచుకొనుటకు ప్రవర్తన ముఖ్యము.బాల్యావస్థయందువిద్యతోపాటు,వినయ,విధేయత,భక్తి,శ్రద్ధ,పరిశ్రమయునుండవలెను.యౌవనావస్థయందుధనార్జనమేకాకసంఘనిర్వహణమేకాక,సదాచారశీలసంపన్నతను,ధార్మికఆధ్యాత్మికభావములను,చిత్తమునుతీర్చిదిద్దుకోవలెను.కౌమారమునకేవలముసంఘ కుటుంబ పోషణలో పాటు, నీతి నిజాయితీలను, పెంపొందించుకొని తన బిడ్డలకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించి సమాజమున అట్టి, సదాచారమును నిరూపించవలెను. సంఘమును ధిక్కరించి స్వకుటుంబ పోషణను మాత్రమే లక్ష్యమందుంచుకోరాదు.
(ప.వా.పు. 163/165)
(చూ॥ అంతర్వాణి, వేదము)